ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ఫోన్లో దందా: ఇద్దరి అరెస్ట్ (ఫోటోలు)
హైదరాబాద్: ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా ఓ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు నుంచే డబ్బు వసూలుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. గురువారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ భుజంగరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
షాపూర్ నగర్కు చెందిన కవకుట్ల రాకేష్ రెడ్డి (28) ఓ వ్యాపారి. ఇతను చింతల్కు చెందిన చౌడవరం మహేష్ కుమార్ (38)తో కలిసి ప్రజాప్రతినిధుల పేర్లను వాడుకొని సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు.

ఆరు నెలలుగా వీరిద్దరూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు పేర్లు చెప్పి పార్టీ ఫండ్ అంటూ ఆరు పరిశ్రమలు, షాపింగ్ మాల్స్తో పాటు వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశారు.
అయితే వీరు ఈ నెల 22న భాగ్యనగర్ కాలనీలోని గ్రీన్ బవార్చీ హోటలో యజమాని భాస్కర్ రావుకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ కింద రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా మరుసటి రోజు కేహీహెచ్బీలోని కళానికేతన్ యజమానికి ఫోన్ చేసి రూ 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వెలుగులోకి ఇలా వచ్చింది:
గ్రీన్ బవార్చీ హోటల్ యజమాని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సొంత అన్న కొడుకు కావడంతో అక్రమ దందా విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. ఆయన సూచన మేరకు హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎవరెవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారో, ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారో వెల్లడించారు.
దీంతో వారి వద్ద నుంచి పోలీసులు రూ. 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కూకట్ పల్లి సీఐ పురుషోత్తం, అడిషనల్ సీఐ సురేందర్ గౌడ్, ఎస్ ఐ క్రాంతికుమార్లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications