మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2కొత్త పింఛన్లు: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అనేక హామీలను ఇస్తున్నాయి. హామీల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. కాగా, టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు కొత్త పింఛన్లను డిసెంబర్ 11 తర్వాత అధికారంలోకి వచ్చే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

60-55ఏళ్లకు తగ్గింపు
యాదాద్రిలో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు రూ.2,016 పింఛను ఇవ్వనుందని తెలిపారు. అంతేగాక, వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60ఏళ్ల నుంచి 55కు తగ్గించనున్నట్లు తెలిపారు.

దివ్యాంగులకు, నిరుద్యోగుల పింఛన్లు..
ఇక దివ్యాంగులకు ఇచ్చే పింఛనును రూ.3,016కు పెంచనున్నట్లు కేటీఆర్ చెప్పారు. అంతేగాక, సుమారు 10లక్షల నిరుద్యోగ యువతకు రూ.3,000ల పింఛను ఇవ్వనున్నట్లు తెలిపారు.

24గంటల కరెంటు.. కాంగ్రెస్ 6గంటలే..
గతంలో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6గంటలు మాత్రమే ఇచ్చిందని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం 24గంటలపాటు ఉచిత కరెంటు అందిస్తోందని తెలిపారు. అంతేగాక, 17వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిందని కేటీఆర్ తెలిపారు.

అభివృద్ధిని అడ్డుకునేందుకు 200కేసులు
మరోసారి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని, రైతు బంధు పథకాన్ని ఎకరాకు రూ.10వేలకు పెంచుతామని చెప్పారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సుమారు 200కేసులు వేసిందని కేసీఆర్ తెలిపారు. చనిపోయిన వ్యక్తులతో కూడా ఈ కేసులు వేయించారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications