విషాదం: వ్యాక్సిన్ వేసుకోవాలంటూ తల్లిదండ్రుల ఒత్తిడి.. యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ.. కొందరు ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో 21ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటూ యువకుడు
హైదరాబాద్ నగరంలోని మణికొండలో శివప్రకాశ్(21) తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలని తల్లిదండ్రులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ తాను వ్యాక్సిన్ వేసుకోనంటూ తేల్చిచెప్పాడు శివప్రకాశ్.

ఇంటి నుంచి బయటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన శివప్రసాద్.. సోమవారం ఇంటికి సమీపంలోని రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించాడు. అతడ్ని గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం శివప్రకాశ్ మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, శివప్రకాశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా..
కాగా, తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతోంది. సోమవారం కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,04,880కు చేరగా, మరణాల సంఖ్య 3,496కు పెరిగింది. జీహెచ్ఎంసీలో 173 కేసులు, ఖమ్మంలో 139, నల్గొండలో 113 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,80,923కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 96.03 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తుండటం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications