మహిళలకు 33 శాతం సీట్లు ... నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనుసరిస్తుందా ?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న , నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒడిశా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒడిశారాష్ట్రంలో మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామి అని ప్రచారం జరుగుతున్న తరుణంలో నవీన్ పట్నాయక్ నిర్ణయంపై తెలంగాణా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.దేశం మొత్తానికి ఆదర్శంగా నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ అనుసరిస్తారా ?

ఒడిశా ముఖ్యమంత్రి సంచలనం .. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు
ఒడిశాలో బీజేడీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులలో ముగ్గురిలో ఒకరికి మహిళలకు స్థానం ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు అందులో భాగంగానే సీట్ల కేటాయింపు చేయనున్నట్లు ప్రకటించారు నవీన్ పట్నాయక్ . ఈ నిర్ణయంతో నవీన్ పట్నాయక్ దేశంలోనే సంచలనం సృష్టించారు.

నవీన్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామిగా చెప్పుకునే టీఆర్ఎస్ .. మరి కేసీఆర్ కూడా మహిళలకు సీట్లిస్తారా ?
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. తాజాగా మహిళల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, మహిళలు తమకు ఓట్లేస్తేనే గెలిచామని, కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు మంత్రులుగా స్థానం కల్పిస్తామని చెప్పారు. ఒకపక్క ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామిగా చెప్పబడుతున్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 33 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ బీజూ జనతా దళ్ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. అదే బాటలో మహిళలకు ప్రాధాన్యత కల్పించి తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జరుగుతుంది.

ఒడిశా సీఎం బాటలో మహిళలకు స్థానం కల్పించాలని కోరుతున్న మహిళాలోకం
మరోపక్క తెలంగాణ రాష్ట్రంలోనూ మహిళా లోకం ఒడిశా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ తరహా నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ తీసుకుని చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని మహిళా లోకం కోరుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామిగా చెప్పుకునే నవీన్ పట్నాయక్ బాటలో నడుస్తారా? రానున్న లోక్సభ ఎన్నికల్లో చట్టసభల్లో మహిళలకు సమాన గౌరవం ఇచ్చి సీట్లను కేటాయిస్తారా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications