పాజిటివ్ నెంబర్ 37: తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు, ఎక్కడంటే.?
హైదరాబాద్: నగరంలోని మణికొండలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మణికొండలో 64 ఏళ్ల వృద్ధురాలతికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. బాధితురాలిని స్వీడన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ యువకుడి కుటుంబసభ్యురాలిగా గుర్తించారు.
తాజాగా కేసుతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. కాగా, ఒక్క రోజులోనే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. హోం క్వారంటైన్ పై గట్టి నిఘా పెట్టామని, బయట తిరిగితే పాస్ పోర్టు సీజ్ చేయమని ఆదేశించామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
రాత్రి 7 నుంచి మార్నింగ్ 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. ఇబ్బంది ఉంటే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. మనిషి వీధిలోకి వస్తే కఠిన చర్యలుంటాయని, బతిమాలే పరిస్థితులు లేవన్నారు. పోలీసులు ఇప్పటి వరకు దండం పెట్టారు.. ఇప్పుడు దండాలు పడతారని అన్నారు. 6గంటల తర్వాత షాపులు ఓపెన్ ఉంటే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం జరగాలి. పాలు రావాలి, పోలానికి నీళ్లు పెట్టాలి. వ్యవసాయ పనులకు అనుమతిస్తున్నామన్నారు.
గంపులు గుంపులుగా కాకుండా పద్దతిగా పనిచేసుకోవాలి. నరేగా పనులు కూడా ఇదేవిధంగా అనుమతిస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అనుమతి ఉందని, కాంట్రాక్టర్లు శానిటైజేషన్ చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాలకు కంచెలు వేసుకున్నారని, ఇది మంచి పద్ధతి అన్నారు. పట్టణాలు కూడా బాగున్నాయని తెలిపారు. జంట నగరాల మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చాయన్నారు. ప్రజలు నియంత్రణ పాటించాలన్నారు. వ్యాధి కంట్రోల్ లోనే ఉందని.. లోకల్ ట్రాన్సిమిట్ కేసు నమోదు కాలేదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా నేటి రాత్రి నుంచి మూడు వారాలపాటు దేశం మొత్తం లాక్ డైన్ అని ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు 539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణతోపాటుతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో పది కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.