వీడియో: తెలంగాణలో ఘోర ప్రమాదం: గుడిసెలపై దూసుకెళ్లిన కారు..నలుగురి దుర్మరణం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమితం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
కరీంనగర్ సమీపంలోని కోతిరామ్పూర్లో ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించింది. కోతిరామ్పూర్ వద్ద రోడ్డు పక్కన చాలాకాలంగా కొంతమంది పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారంతా కత్తులు, ఇతర పనిముట్లను తయారు చేయడం, వాటికి సానపట్టడం వంటి చిన్నచిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు. కమ్మరి వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు.

ఈ తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి కమాన్ చౌక్ వైపునకు వెళ్తోన్న టీఎస్ 02 ఈవై 2121 కారు కోతిరామ్పూర్ వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తోన్న వారిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళ కారు-కరెంట్ పోల్ మధ్య నలిగిపోయింది..అక్కడికక్కడే మరణించింది.
మరణించిన వారిని పరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. ప్రమాదం తరువాత కారు డ్రైవర్ పరారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తరచూ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications