మంత్రుల నివాసాల్లో పాములు: భయాందోళనల్లో మంత్రివర్యులు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం:12లో ఉన్న మంత్రుల నివాసాల వద్ద శనివారం కలకలం రేగింది. నిత్యం రద్దీగా ఉండే ఆ భవంతుల వద్ద పాములు తరచూ కనిపిస్తుండటంతో స్థానికులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే... మంత్రుల కోసం ఆధునాతన సౌకర్యాలతో బంజారాహిల్స్లోని రోడ్ నెం:12లో భవంతులు నిర్మించారు. అప్పటి వరకు అక్కడ ఉన్న కొండలు, గుట్టలను తొలగించి అధికార యంత్రాంగం అక్కడ మంత్రుల నివాసాలను నిర్మించింది.
ఈ తంతు అంతా ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ మంత్రులు ఈ నివాసాల్లోనే ఉంటున్నారు. చెట్లు, పొదల నుంచి పాములు బయటికొచ్చి నివాసాల మధ్య తరచూ దర్శనమిస్తున్నాయి.
శనివారం నాడు ఏకంగా ఆరు పాములు అక్కడ దర్శనమిచ్చాయి. వీటిని చూసిన సందర్శకులు, మంత్రుల క్వార్టర్స్లో పనిచేసే సిబ్బంది విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రుల నుంచి సమాచారం అందుకున్న జూ సిబ్బంది పాములను పట్టుకుని జూ పార్కుకు తరలించారు. వారం రోజుల తర్వాత మరోసారి పాముల కోసం గాలిస్తామని సిబ్బంది తెలిపారు.