కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 415 కేసులు.. మరో ముగ్గురు మృతి...
తెలంగాణలో కొత్తగా 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 537 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (డిసెంబర్ 31) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
భారత్లో కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్ ఎప్పుడంటే.. తేల్చేసిన ఎయిమ్స్ చీఫ్.. కీలక వ్యాఖ్యలు
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1541కి చేరింది. ప్రస్తుతం 5974 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 3823 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 627 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,78,839కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 43,413 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 68,82,694కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,84,919 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96 శాతం ఉండగా తెలంగాణలో 97.37శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 91,రంగారెడ్డిలో 43 కేసులు ఉన్నాయి.
మరోవైపు యూకెలో వెలుగుచూసిన కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్కు సంబంధించిన కేసు తెలంగాణలోనూ బయటపడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 10న యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తి(49)కి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది. సీసీఎంబీలో అతని శాంపిల్స్ నుంచి వైరస్ జీనోమ్ను విశ్లేషించగా ఈ విషయం నిర్దారణ అయింది. అతని తల్లి(71)కి కూడా కరోనా పాజిటివ్గా తేలగా... ఆమెకు సోకింది కొత్త వైరసా లేక పాత వైరసా అన్నది ఇంకా నిర్దారించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ నిమిత్తం సీసీఎంబీ ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో తెలంగాణకు మొత్తం 1216 మంది ప్రయాణికులు యూకె వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్ చేయగా.. మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు తెలిపారు. మరో ఆరుగురు విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. మిగిలిన 996 మందికి కరోనా నెగటివ్గా నిర్దారణ అయిందని తెలిపారు. పాజిటివ్గా తేలిన 21 మందిలో మరో 9 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు.