మహిళ పొట్టలోంచి 51 డ్రగ్స్ ప్యాకెట్లను తీసిన వైద్యులు
హైదరాబాద్ : జొహెన్నెస్బర్గ్ నుంచి వయా దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వచ్చిన దక్షిణాఫ్రికా యువతి ముసా(30) శరీరంలోంచి 51 ప్యాకెట్లను వెలికి తీశారు. ఆమె శరీరంలో డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్లు హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్టులో నార్కోటిక్ అధికారులు గుర్తించిన విషయం విదితమే.
ఈ క్రమంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎండోస్కోపి పరీక్షలు శరీరంలో ఉన్న 40 డ్రగ్స్ ప్యాకెట్స్ను సోమవారం బయటకు తీశారు వైద్యులు. మంగళవారం ఉదయం తాజాగా మరో 11 ప్యాకెట్స్ బయటపడ్డాయి. మహిళ కడుపులో నుంచి డ్రగ్స్ ప్యాకెట్స్ మొత్తం తీసినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు.
మహిళ కడుపులోని మాదకద్రవ్యాలను కొకైన్ గా గుర్తించామని ఎన్సీబీ సూపరింటెండెంట్ దినేశ్ చౌహాన్ తెలిపారు. మహిళ కడుపులో లభించిన కొకైన్ 600 గ్రాములు ఉంటుందని చెప్పారు. కొకైన్ ను ల్యాబ్ పరీక్షలకు పంపామని చెప్పారు.
తాను గర్భవతినని ముసా నార్కోటిక్ అధికారులను నమ్మించబోయింది. కానీ అధికారులకు అనుమానం వచ్చి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించడంతో అసలు విషయం బయట పడింది.