జగిత్యాల జిల్లాలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 546 కరోనా కేసులు, ఏడుగురు మృతి
కరీంనగర్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. పలు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదువుతున్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 546 కరోనా కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.
గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల మంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్న కోరుట్ల, మెట్ పల్లి, కొండ్రికర్ల తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రవి సోమవారం పర్యటించారు.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఇక కరోనా పాజటివ్ వచ్చినవారు ఖచ్చితంగా గృహ నిర్బంధంలోనే ఉండాలని, సైరన వసతులు లేనివారిని కొండగట్టు జేఎన్టీయూ ఐసోలేషన్ కు తరలించాలని కలెక్టర్ రవి సూచించారు. ఇక తీవ్ర అనారోగ్యం ఉన్నవారిని జిల్లా ఆస్పతరలించాలన్నారు.
కంటైన్మెంట్ జోన్లలో అవసరమైన వారికి నిత్యావసరాలను ఇళ్ల వద్దకు పంపించాలని ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు తనిఖీలు చేస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కొండ్రికర్ల గ్రామంలో ద్విచక్ర వాహనంపై మాస్కు లేకుండా వెళ్తున్న యువకులను కలెక్టర్ స్వయంగా ఆపి రూ. 1000 జరిమానా విధించారు. ప్రజల్లో కరోనా నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్ జిల్లాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 104 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం కరోనా కేసులు 3,24, 091 కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,791 కు పెరిగింది . గడచిన 24 గంటల్లో 79,027 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,251 కేసులు నమోదయ్యాయి .