తెలంగాణలో మొత్తం ఎన్ని పార్టీలున్నాయి.. ఎన్ని బరిలోకి దిగుతున్నాయి..?
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధాన పార్టీలు మాత్రమే ప్రచారంలో ఫోకస్ అవుతున్నాయి. కారు గుర్తుతో టీఆర్ఎస్, హస్తం గుర్తుతో కాంగ్రెస్, సైకిల్ గుర్తుతో టీడీపీ, కమలం గుర్తుతో బీజేపీ... ఇలా ప్రధాన పార్టీలు మాత్రమే ఫోకస్ అవుతున్నాయి. ఇక ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా గుర్తింపునకు నోచుకోని పార్టీలు చాలానే తెలంగాణలో ఉన్నాయి. అసలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరై గుర్తింపునకు నోచుకోని పార్టీలు ఎన్ని ఉన్నాయో తెలుసా...?
ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇక ప్రతి ఒక్కరి నోట ప్రధాన పార్టీల మాటే వినిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలాంటి పార్టీల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి తెలంగాణలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి గుర్తింపు నోచుకోని పార్టీలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీల గుర్తులన్నీ ఈవీఎంలపై పెట్టాలంటే చాలా ఇబ్బందిగా మారుతోంది. కారు, హస్తం, సైకిల్, కమలంలాంటి గుర్తులతో పాటు గ్రామఫోన్, కెమెరా, ఆటో రిక్షా, టీవీ, కప్పు సాసరు లాంటి గుర్తులు కూడా కొన్ని ఈవీఎంలపై కనిపించనున్నాయి. ఇలా మొత్తం 66 రిజిస్టర్ అయిన పార్టీల నుంచి డజనుకు పైగా గుర్తింపునకు నోచుకోని పార్టీల గుర్తులు ఈవీఎంలపై కనిపించనున్నాయి.
సొంత అజెండాలపై పుట్టిన పార్టీలు
గుర్తింపునకు నోచుకోని పార్టీలు ఒక లక్ష్యంతో ఏర్పాటు అయినవే. కొన్ని పేదల కోసం ఆవిర్భవిస్తే.... మరి కొన్ని సామాజిక అంశాలపై స్థాపించడం జరిగింది. ఇంకొన్ని సమానత్వం కోసం పురుడుపోసుకున్నాయి. ఇంకొన్ని మతవివక్షలకు వ్యతిరేకంగా పుట్టాయి. "సమాజంలో పేదవర్గాల వారు విద్య ఉద్యోగం కోసం చేతులు ఎందుకు చాచాలి..? రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ఎందుకు వినియోగించుకోరాదు..? అధికారంలోకి వస్తే కులరాజకీయాలు లేకుండా మంచి పరిపాలన అందిస్తాం" అని అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మొహ్మద్ ఖాజాం అలీ ఖాన్ తెలిపారు. తన పార్టీ తరపున 16 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నియోజకవర్గాలైన ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, గోషామహల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆలేరులతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరో గుర్తింపునకు నోచుకోని పార్టీ మజ్లిస్ మర్కాజ్-ఈ-సియాసీ పార్టీ . ఈ పార్టీకి సంబంధించి నలుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే పార్టీ 2014లో 35 స్థానాల్లో పోటీ చేసింది.
లబ్ధి కోసమే పుట్టిన పార్టీలు అని చెబుతున్న విశ్లేషకులు
ఇక శ్రమజీవి పార్టీ నుంచి 2014లో వరంగల్ లోక్సభ స్థానంలో నిలిచిన అభ్యర్థికి 28,371 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బీజేపీ తరువాత మూడో స్థానంలో నిలిచాడు. అంతేకాదు నాలుగో స్థానంలో వైసీపీ నిలిచింది. అందుకే ఈ సారి నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు శ్రమజీవి పార్టీ అధ్యక్షుడు జాజుల భాస్కర్ తెలిపారు. ఇదిలా ఉంటే నిపుణులు మాత్రం గుర్తింపునకు నోచుకోని పార్టీలు గెలవలేవని చెబుతున్నారు. కేవలం లబ్ధి పొందేందుకే ఈ పార్టీలు పుడుతాయని చెబుతున్నారు. ఇది రాజకీయ లభ్ధి కావచ్చు లేదా ఆర్థికపరమైన లబ్ధి కావొచ్చని విశ్లేషిస్తున్నారు. కొన్ని పార్టీలు మాత్రం కేవలం జాతకాల ఆధారంగా పుడుతున్నాయని కూడా చెప్పారు. సాధారణంగా తమ ఓట్లకు ముప్పు వాటిల్లుతుందని ప్రధాన పార్టీలు భావిస్తే ఇతర పార్టీల ఓట్లు చీల్చేందుకు స్వతంత్ర అభ్యర్థులను బరిలో నిలుపుతాయని అది సర్వ సాధారణమని అనలిస్టులు చెబుతున్నారు.