తెలంగాణలో కరోనా ఉధృతి: వెయ్యికి చేరువలో కొత్త కేసులు, 5వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఐదారు వందల కేసులు నమోదు కాగా, తాజాగా, వెయ్యికి చేరువయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,593 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 923 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 366 కొత్త కేసులు వచ్చాయి.
రంగారెడ్డి జిల్లాలో 79 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 59 కేసులు, నల్గొండ జిల్లాలో 51 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 34 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 739 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా మరణాలు సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం.

తెలంగాణలో ఇప్పటి వరకు 8,18,290 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8,09,009 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,170కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. అంతకుముందు రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 38,122 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 836 మందికి పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు అందరూ తప్పనిసరిగా ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని పేర్కొంది. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉండటంతో పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది.












Click it and Unblock the Notifications