టీవీ సౌండ్ వివాదం: డైరెక్టర్ అమ్మ రాజశేఖర్పై కేసు నమోదు
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ తనపై దాడి చేశాడంటూ ఓ జిమ్ ట్రైనర్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసముండే అమ్మ రాజశేఖర్ ఫ్లాట్ కింది అంతస్థులో కోటిరెడ్డి అలియాస్ వెంకట్ అద్దెకు ఉంటున్నాడు.
గత ఆదివారం టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టారనే విషయంలో గొడవ చోటుచేసుకుంది. దీంతో ఇటీవల వెంకట్ ఇంటిని ఖాళీ చేశాడు. మిగిలిన సామాన్లు తెచ్చుకునేందుకు గురువారం తన స్నేహితుడు మోహన్కుమార్తో అక్కడికి వెళ్లాడు.
అయితే, పైఅంతస్థులో నివాసముంటున్న అమ్మ రాజశేఖర్ తమను గదికి పిలిపించుకొని తన అనుచరులతో అకారణంగా నిర్బంధించి దాడి చేయించాడని బాధితుడు వెంకట్ తెలిపాడు. అక్కడ్నుంచి తప్పించుకున్న వెంకట్.. గురువారం రాత్రి ఠాణాలో ఫిర్యాదులో చేశాడు.
పోలీసులను చూసి చోరీ సొమ్ము పడేసి పరార్
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పోలీసులు గురువారం ఉదయం 5 గంటలకు స్థానిక చెక్పోస్టు నుంచి పెద్దచెరువు కట్ట మీదుగా పెట్రోలింగ్ భాగంగా వాహనంలో వెళ్తున్నారు. ముగ్గురు వ్యక్తులు పోలీసుల రాకను గుర్తించి కట్టమీద నుంచి దిగి బైక్, మూటలు వదిలేసి పరుగుపెట్టారు.
అనుమానంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ చిక్కలేదు. పోలీసులు మూట విప్పిచూడగా దేవాలయానికి చెందిన అరకిలో వెండి అభరణాలు, రూ.11వేల నగదు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పరారైన నిందితులు శంషాబాద్ మండలం గామ్స్మియాగూడ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.