హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా డీజై సౌండ్స్తో శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతించిన సమయానికి మించి, ఎక్కువ శబ్ద తీవ్రతతో పాటలు పెట్టారని, దీనిని సుమోటోగా తీసుకుని మేయర్ విజయలక్ష్మిపై కేసు మోదు చేసినట్లు తెలిపారు.
అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12 లోని ఎన్బీనగర్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. అయితే, రాత్రి 11.45 తర్వాత కూడా డీజే సౌండ్స్ పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు.

అయితే మహిళలు అడుకునే బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మేయర్ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ మేరకు పోలీసులు కార్యక్రమ నిర్వాహకుడు విజయ్కుమార్, డీజే సౌండ్స్ నిర్వాహకుడు గౌస్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం, బాణాసంచా కాల్చడంపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరేగింపుల్లో ఇక నుంచి డీజే సౌండ్ సిస్టమ్, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. డీజే వాడటం వలన తీవ్ర శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు.
ఇటీవల సీపీ ఈ విషయమై మతపెద్దలు, ఇతర సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి డీజే వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి సీపీ వివరించారు. ఈ కార్యక్రమానికి బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, శాసనసభ్యులు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications