దారుణం: ఆ ఆరుగురు ఆత్మహత్య చేసుకోలేదు.. హత్య చేయబడ్డారు
ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలేరు జలాశయానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రం కాల్వలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత వారివి హత్యలేనని తేలింది.
మృతుల్లో ఒకరైన షేక్ సలీం(32) కుటుంబసభ్యులను హత్య చేసి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి వేధింపులు తాళలేకే సలీమ్ ఈ ఘోరానికి పాల్పడినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ తెలిపారు. హత్య కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇక్బాల్ వెల్లడించారు.
కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు గ్రామానికి చెందిన షేక్పెంటూ షాహేబ్(50), షేక్మహాబూబీ(45), వీరి కుమారుడు షేక్సలీం(32), సలీం భార్య రజియ(28), వీరి పిల్లలు షానాజ్ బేగం(8) నస్రీనా(4) బుధవారం తెల్లవారుజామున కాలువలో విగతజీవులుగా కనిపించారు. సలీమ్ బాబాబ్ కొడుకు షేక్లాల్ గ్రామస్థులకు ఈ విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మత్స్యకారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
ఆత్మహత్య కాదు.. హత్యే..
మొదట అందరూ ఈ కుటుంబానిది ఆత్మహత్యే అనుకున్నా.. కుటుంబంతోపాటు వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చిన షేక్ చెప్పిన విషయంతో అసలు విషయం తెలిసింది. సలీమ్ అర్థరాత్రి సమయంలో నిద్రలేపి కుటంబానికి ఎవరో చేతబడి చేశారని తెలిపాడు.
'పాలేరు జలాశయం వద్దకు వెళ్లి పూజలు చేస్తే కుటుంబ పరిస్థితి బాగుపడుతుందని చెప్పడంతో అందరం పాలేరు జలాశయం కాలువ వద్దకు వెళ్లాం. అనంతరం ఇంట్లో టీవీ వద్ద పూజకు సంబంధించిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు మరిచిపోయానని సలీమ్ చెప్పడంతో వాటిని తీసుకురావడానికి ఇంటికెళ్లాను. సలీమ్ చెప్పిన చోట వెతకగా ఓ లేఖ మాత్రమే దొరికింది. దీంతో తిరిగి పాలేరు కాల్వ వద్దకు వచ్చి చూసేసరికి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. కాలువలో చూడగా మృతదేహాలు తేలుతూ కనిపించాయి' అని షేక్లాల్ ఈ ఘటన గురించి వివరించాడు.