దారుణం: బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బాలికపై రేప్
హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పిన దుండగుడు.. ఇంట్లోకి తీసుకెళ్లి.. కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధిత బాలిక బంధువుల ఆందోళనతో తీవ్ర ఆ ప్రాంతం కొంత ఉద్రిక్తంగా మారింది.
స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన బాలిక(9) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. రోజూ ట్యూషన్కు వెళ్లే బాలికను గమనించిన ఓ గుర్తుతెలియని యువకుడు.. ఆమె కోసం సోమవారం సాయంత్రం బస్తీలోని ఓ కిరాణ దుకాణం వద్ద మాటు వేశాడు.
బాలిక బయటకు రాగానే ఆమెకు మాయమాటలు చెప్పి.. బస్తీలోని ఓ ఇంట్లోని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తి చూపి చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు.
అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన సంఘటనను కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు బోరబండ పోలీసు ఔట్పోస్టులో ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.