నమ్మివెళితే.. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారం, హత్య, చివరకు అతడు కూడా
యాదాద్రిభువనగిరి: జిల్లాలోని మోటకొండూరు, వలిగొండ మండలాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తను ప్రేమించిన యువకుడే అనుమానంతో యువతిపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులతో ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడైన ఆ యువతి ప్రియుడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలిపై అనుమానంతో హత్యకు కుట్ర..
మోటకొండూరు మండలానికి చెందిన బాధిత యువతి కనిపించడంలేదంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ దారుణాలు వెలుగుచూశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వివరించారు. వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన మిర్యాల రవి ఓ కర్మాగారంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. రవికి సదరు యువతితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే, ఆ యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని రవి అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమెను చంపేయాలని తన స్నేహితుడైన చిన్నపాక రవితేజతో కలిసి కుట్రపన్నాడు.
సాయం చేస్తానంటూ పిలిచి.. స్నేహితుడితో కలిసి ఘాతుకం..
ఆ యువతికి డబ్బులు అవసరమని తెలిసి.. ఆర్థికసాయం చేస్తానంటూ ఆగస్టు 18న ఆమెను పిలిచాడు రవి. ఈ క్రమంలో సదరు యువతి తన తల్లితో కలిసి వలిగొండకు వచ్చి అక్కడే ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించింది. అనంతరం మార్కెట్ వద్ద తల్లిని వదిలి.. తన ద్విచక్రవాహనంపై వలిగొండలోని వలిపాషగుట్ట వద్దకు వెళ్లింది యువతి. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు రవి. ఆ తర్వాత అతని స్నేహితుడు రవితేజ కూడా ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను చున్నీతో ఉరివేసి చంపేశారు.
అనుమానాస్పద స్థితిలో రవి కూడా మృతి..
ఆ తర్వాత మృతదేహాన్ని పక్కనే చెట్లపొదలో పడేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. రవి తన ద్విచక్రవాహనంపై, రవితేజ మృతురాలి స్కూటీపై భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వరకు వెళ్లారు. అక్కడ్నుంచి రవితేజ హైదరాబాద్కు, రవి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకుని వెళ్లిపోయారు. కాగా, రవి మృతదేహం ఆగస్టు 20న నాగిరెడ్డిపల్లి శివారులో లభ్యమైంది. అతనిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
మరో నిందితుడి అరెస్ట్.. రెండు కుటుంబాల్లో విషాదం..
ఇది ఇలావుండగా, ఆగస్టు 19న బాధిత యువతి తండ్రి వలిగొండ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను అత్యాచారం చేసి, హతమార్చింది రవి, రవితేజలేనని గుర్తించారు. ప్రధాన నిందితుడు రవి మృతి చెందడంతో ఏ2గా ఉన్న రవితేజపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ప్రధాన నిందితుడు రవి మృతిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, ఈ దారుణ ఘటన అటు బాధిత యువతి, ఇటు మృతుడు రవి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.