Dharani: ధరణిని రద్దు చేస్తారా లేదా.. ప్రశ్నించిన హైకోర్టు..!
భూముల రికార్డుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. అయితే దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పోర్టల్ సరిగలేకపోవడంతో పాటు కలెక్టర్ స్థాయి వారికే సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వడంతో చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. ధరణి వల్ల చాలా మంది పేదలు కూడా భూములు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ధరణి పోర్టల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని కొనసాగించారు.
ధరణిపై ప్రతిక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ధరణిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ధరణిలో మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తారో లేదో లేక రద్దు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ విధానం ఏమిటో తెలిసిన తర్వాతే తాము తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి గడువు కావాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును కోరారు.

దీంతో ప్రభుత్వానికి నాలుగు వారాలపాటు సమయం ఇస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాస్థానం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో పలు సర్వే నెంబర్లల్లోని 146 ఎకరాల క్రయవిక్రయాలకు చెందిన దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట తహసీల్దార్ ఇవ్వడం లేదంటూ హైదరాబాద్కు చెందిన ఎ. జైహింద్ రెడ్డి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన హైకోర్టు పై విధంగా స్పందించింది. ధరణి వెబ్ సైట్ పై గతంలో కూడా హైకోర్టు విచారణ జరిపింది. సీసీఎల్ఏను వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించుకుని పలు అంశాలపై ప్రశ్నించింది. గ్రామ, మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ల ద్వారా క్రోడీకరించి వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. అమలు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏకు స్పష్టం చేసింది.
అయినప్పటికీ ధరణి సమస్యలు పరిష్కారం కాలేదు. శుక్రవారం జరిగిన విచారణ సమయంలో సమస్యల పరిష్కారానికి మాడ్యుల్స్ ఏర్పాటు కాలేదని గుర్తించిన హైకోర్టు.. అసలు ధరణి పోర్టల్ను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చెప్పాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications