అసదుద్దీన్ ఒవైసీ క్షేమం కోసం హైదరాబాదీ వ్యాపారి..అనూహ్య చర్య: పారిన రక్తం
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై చోటు చేసుకున్న హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో సచిన్ పండిట్, శుభమ్ అనే వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీ వెళ్తోన్న అసదుద్దీన్ ఒవైసీపై మూడురోజుల కిందట కాల్పులు జరిగిన విషయంపై తెలిసిందే. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది. సచిన్ పండిట్, శుభమ్ అనే వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు.

ఉత్తర ప్రదేశ్ పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేశారు. 9 ఎంఎం పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తరువాత కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఒవైసీకి జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. ఆరుమంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, 22 మంది ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేసింది. దీన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. తనకు ప్రాణభయం లేదని స్పష్టం చేశారు. మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మసంసద్ ప్రసంగాల అనంతరం తనపై హత్యాయత్నం చోటు చేసుకుందనే విషయాన్ని గుర్తు చేశారు.
ఈ ఘటన తరువాత పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రార్థనలను ముగించుకున్న వెంటనే రోడ్ల మీదికి వచ్చారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తోన్న కారుపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ర్యాలీ తరలి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

తాజాగా- ఒవైసీ క్షేమం కోసం హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి అనూహ్య చర్యకు దిగారు. ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని, ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ 101 మేకలను బలి ఇచ్చాడు. ఆదివారం హైదరాబాద్లోని బాగ్-ఎ-జహనారా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఏఐఎంఐఎం శాసన సభ్యుడు అహ్మద్ బలాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసదుద్దీన్ ఒవైసీకి ఎలాంటి ప్రాణహాని ఉండకూడదని ప్రార్థిస్తూ 101 మేకలను బలి ఇచ్చానని చెప్పాడు.












Click it and Unblock the Notifications