టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్ - సినీ ప్రముఖులపై తేల్చిందేంటి : తెర వెనుక..!!
సినీ ఇండస్ట్రీలో...పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారంలో ఏం జరుగుతోంది. ఇప్పటి దాకా అనేక మంది బాలీవుడ్..టాలీవుడ్ ప్రముఖులను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం తేల్చింది. కొద్ది నెలల క్రితం రోజుకో సినీ ప్రముఖుడిని ఈడీ గంటల తరబడి విచారించింది. వారి నుంచి ఆర్దిక లావాదేవీలతో పాటుగా.. పలు అంశాల పైన ఆరా తీసింది. తాము పిలిచిన సమయంలో రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే, అసలు ఈ కేసులో ఇప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు.
2017 నుంచి కొనసాగుతున్న విచారణ
మధ్యలో తెలంగాణ రాజకీయ నేతల మధ్య ఇదే వ్యవహారంలో ఆరోపణలు.. సవాళ్లు చోటు చేసుకున్నాయి. 2017 జులైలో ఆబ్కారీ అధికారులు కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వటంతో..ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. తొలుత అబ్కారీ శాఖ అధికారులు టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు.
సినీ ప్రముఖలన నుంచి స్టేట్ మెంట్స్
వారిచ్చిన స్టేట్ మెంట్స్ ను రికార్డు చేయటంతో పాటుగా.. డ్రగ్స్ వినియోగిస్తున్నారా లేదా అనేది తేల్చేందుకు కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఈ సమయంలోనే సడన్ గా ఈడీ అధికారులు తెర మీదకు వచ్చారు. మళ్లీ కొత్తగా గత ఆగస్టులో కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు.
సినీ సెలబ్రెటీల పాత్ర పై ఆరా
దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ, రానా, ఛార్మి, రకుల్ప్రీత్సింగ్ వంటి 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకూ కొనసాగింది. దీంతో..సినీ పరిశ్రమలో ఏం జరుగుతోందనే చర్చకు ఈ పరిణామాలు దారి తీసాయి. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ తాము కోర్టులో ఇదే అంశం పైన విచారణ కోరుతూ పిటీషన్ దాఖలు చేసామని.. దాని కారణంగానే ఈడీ విచారణ చేసిందని చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ పైన ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు.
Recommended Video
చివరకు ఈడీ తేల్చిందిదేనా
మంత్రి కేటీఆర్ సైతం వాటిని తిప్పి కొట్టారు. సవాల్ చేసారు. ఇక, ఇప్పుడు ఈడీ అధికారులు ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని మూసివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలేవీ లభించలేదు. ఇప్పుడు ఈడీ దర్యాప్తూ ఇలానే ముగిసిపోనుంది. దీంతో..ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ఆరంభించే అవకాశం కనిపిస్తోంది. ఈడీ విచారణకు హారజరైన సినీ ప్రముఖులకు ఇప్పుడు ఈ సమాచారం భారీ రిలీఫ్ ఇవ్వనుంది.