సాఫ్ట్వేర్ ఇంజినీర్ నరిష్మ: త్వరలో పెళ్లి.. అమెరికా నుంచి వచ్చి.. కరోనా కాటుకు బలైంది
హైదరాబాద్/పెద్దపల్లి: కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనా కాటు వేయడంతో అనేక కుటుంబాల్లో ఒకరికొకరు లేకుండా పోతున్నారు. చిన్నాపెద్ద లేకుండా కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాల్సిన ఓ యువతిని బలిగింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మరెడ్డి(28) హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డారు. మే నెలాఖరులో పెళ్లి ఉండటంతో రెండు నెలల కిందటే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు.
ఓ పని మీద చెన్నై వెళ్లి వచ్చిన అనంతరం కరోనా బారనిపడ్డారు నరిష్మ రెడ్డి. చికిత్స పొందిన అనంతరం ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపడంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 40 రోజులకుపైగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు.
కాగా, నరిష్మ చికిత్స కోసం రూ. 50 లక్షలకుపైగా ఖర్చు చేశారు కుటుంబసభ్యులు. అయినప్పటికీ ఆమె ప్రాణం దక్కకపోవడంతో తీవ్ర శోకంలో మునిగిపోయారు. త్వరలో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాల్సిన నరిష్మ.. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recommended Video
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1.6 లక్షల నమూనాలను పరీక్షించగా.. 1489 మందికి కరోనా సోకినట్లు తేలింది. 11 మంది కరోనాతో మరణించారు. 1436 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,975 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 96.13 శాతానికి పెరిగింది.