చాట్లో పరిచయమై మోసం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
నల్గొండ: ప్రేమించి మోసం చేసిన యువకుడితో తనకు వివాహం జరిపించాలని ఓ యువతి అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతనితో పెళ్లి చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. కాగా, ఆమెకు పలు మహిళా సంఘాల నేతలు మద్దతు పలికారు.
హైదరాబాద్ యూసు్ఫగూడకు చెందిన కీర్తిరెడ్డి మహిళా సంఘాలతో కలిసి ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రియుడు రణధీర్ రెడ్డి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన రణధీర్రెడ్డి ఎంబిబిఎస్ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రైవేట్ వైద్యుడిగా పని చేస్తున్నాడు.
రణధీర్రెడ్డికి యూసఫ్గూడాకు చెందిన కీర్తిరెడ్డితో చాట్లో పరిచయమై తొమ్మిది నెలలుగా ప్రేమాయణం కొనసాగింది. కీర్తిరెడ్డికి మాయమాటలు చెప్పి లోబర్చుకొని అబార్షన్ కూడా చేయించాడని మహిళా సంఘాలు ఆరోపించాయి.
రణధీర్రెడ్డి, అతని కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, న్యాయం కావాలని ఆదివారం రెండోసారి సేవ్ ఉమెన్ మహిళా సంఘాలతో కలిసి దేవరకొండలో శివాజీనగర్లో ఉన్న రణధీర్రెడ్డి గృహం ఎదుట దీక్ష చేసింది కీర్తి. దీక్ష చేపట్టిన సమయంలో రణధీర్రెడ్డి కుంటుంబసభ్యులు రెండు రోజులుగా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు.
స్థానికులు, మహిళా సంఘాలు, పోలీసులు కలుగజేసుకొని రణధీర్రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పడంతో దీక్షను విరమించి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కీర్తిరెడ్డి మహిళా సంఘాలతో దీక్ష చేపట్టింది.
రణధీర్రెడ్డి రెండు రోజుల్లోగా తనను పెళ్లి చేసుకోకపోతే తల్లి, చెల్లితో కలిసి అతడి ఇంటి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని కీర్తిరెడ్డి మీడియాకు తెలిపింది. కాగా, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనందున అక్కడే తేల్చుకోవాలని బాధితులకు దేవరకొండ సీఐ తెలిపారు.