వివాహితపై ఇంటికెళ్లి గొడ్డలితో దాడి: గతంలో జైలుకు పంపిందనే కక్షతోనే!
హైదరాబాద్: నగర శివారు గుర్రంగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన ఓ వివాహితపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని రాహుల్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. గతంలో రాహుల్పై వివాహిత వేధింపుల కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు.. అతనిపై గతంలో నిర్భయ కేసు నమోదు చేసి, జైలుకు పంపారు.

ఇటీవల జైలు నుంచి విడుదలైన రాహుల్ గౌడ్.. జైలుకు పంపిందన్న కక్షతో వివాహితపై ఆమె ఇంటికి వెళ్లి గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వివాహిత పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఇది ఇలా ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ఓ మహిళ ప్రాణం తీశారు అత్తింటివారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
రామన్నపేట గ్రామానికి చెందిన కొండా కోమలత(29)కు గణేష్ అనే వ్యక్తితో 2016లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం కోమలతకు జూనియర్ పంజాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. దీంతో మండలంలోని గొర్రెగుండం గ్రామంలో ఆమె పనిచేస్తున్నారు.
పీహెచ్డీ చేస్తున్న కోమలత ఆదివారం అర్ధరాత్రి స్నానాల గదిలో సజీవ దహనమయ్యారు. అత్తా, ఆడపడచుల ప్రోద్బలంతోనే భర్త గణేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడని మృతురాలి పెద్దన్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధిరాలి భర్త, అత్త, ఆడబిడ్డలపై కేసు నమోదు చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications