బుక్స్ కోసం వెళ్ళిన బాలికకు లిఫ్ట్ ఇచ్చి.. పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం; వనపర్తిలో దారుణం
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. మహిళలు బాలికల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లాలోని అటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. పుస్తకం కొనుక్కోవడానికి వెళుతున్న క్రమంలో ఒక బాలికను బైక్ పై లిఫ్ట్ ఇచ్చి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై ఎవరికీ చెప్పొద్దని బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి టౌన్ కు చెందిన ఇంటర్ స్టూడెంట్ పుస్తకాలు కొనేందుకు బయటకు వెళుతున్న క్రమంలో ఆటో స్టాండ్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తుండగా, ఆమెకు తెలిసిన వ్యక్తి అటుగా వచ్చాడు. ఎక్కడికి వెళ్లాలని బాలికను అడిగాడు. తెలిసిన వ్యక్తి కావటంతో బాలిక పుస్తకాలు కొనుక్కోవడం కోసం అమ్మ పనిచేసే చోటికి వెళ్లాలని పేర్కొంది. దీంతో తాను అటువైపు వెళుతున్నా అని, బాలికను అక్కడ వదిలి పెడతానని బైక్ ఎక్కించుకున్న సదరు వ్యక్తి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి పొదల మాటున బాలికపై అత్యాచారం చేశాడు.
ఆపై ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, ఎక్కడైనా చెబితే బాగోదని హెచ్చరించాడు. తర్వాత బాధితురాలిని బైక్ పై ఎక్కించుకుని ఆమె ఇంటి వద్ద వదిలి పెట్టాడు. తెలిసిన వ్యక్తి అని నమ్మి వెళితే బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
బాలిక తల్లిదండ్రులు సదరు కామాంధుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలిసిన వ్యక్తి అని నమ్మి అతని బైక్ పై వెళ్లినందుకు బాలిక అమానుష ఘటనకు గురైంది. అందుకే తెలిసిన వారైనా సరే జాగ్రత్తగా ఉండాలని, కుటుంబ సభ్యులతో కాకుండా ఎవరితోనూ బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.