విషాదం: భర్త ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని, భార్య ఆత్మహత్య
హైదరాబాద్: తరచూ విధులకు వెళ్లిన భర్త రాత్రి ఆలస్యంగా వస్తున్నాడని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మలక్పేట పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
2006లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గోకరం ప్రాంతానికి చెందిన గాదంశెట్టి వెంకటేశ్వర్లు రెండో కుమార్తె ప్రసన్న(32)కు గుంటూరు జిల్లా తెనాలి నివాసి గుంటూరు సుమంత్తో వివాహం జరిగింది. భార్యభర్తలు సైదాబాద్లోని తిరుమలహిల్స్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
కాగా, సుమంత్ జూబ్లీహిల్స్లోనున్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ప్రసన్న సంక్రాంతి పండగ కోసం ఇద్దరు పిల్లలతో కలిసి దుస్తులు కొనుగోలు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, రాత్రి వరకు కూడా భర్త రాలేదు. తరచూ ఇలాగే ఆలస్యంగా వస్తున్నాడని మనస్తాపం చెందిన ఆమె.. అర్ధరాత్రి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది.
రాత్రంతా భర్త ఇంటికి రాలేదు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోంచి లేచిన పిల్లలు తల్లిని చూసి ఏడుస్తుండటంతో సమీపంలోని వారు గుర్తించి మలక్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రసన్న తండ్రి వెంకటేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. అయితే, భార్యభర్తల మధ్య ఎలాంటి కలహాలు లేవని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.