ఆటోలో కొడుకును వదిలేసి పరారీ, భర్తకు ఫోన్: విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేట పాత బస్టాండ్ సమీపంలో ఓ తల్లి ఏడాదిన్నర బాబును ఆటోలో వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాబును స్థానికులకు అప్పగించి భార్యను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.
చిన్నారిని స్థానికులు సూర్యాపేట పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళను పెన్పహాడ్ మండలం పెదసీతారాంతండా మహిళగా గుర్తించారు. అయితే ఆమె వెళ్లిపోవడానికి భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేములపల్లి మండలం చెట్టిపాలెంలో పదోతరగతి విద్యార్థిని భార్గవి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, ప్రేమ వేధింపులే విద్యార్థిని మృతికి కారణమని తెలుస్తోంది. వేణు అనే యువకుడి వేధింపులు తాళలేక భార్గవి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.