రైల్వేస్టేషన్, రైల్వేలైన్, రైల్వే జంక్షన్ కోసం రైల్వే ముందు తెలంగాణా ఎంపీ విన్నపాల చిట్టా!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే ప్రగతికి, అభివృద్ధికి పెద్దపీట వేసి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైల్వే లైన్ల విస్తరణ, కొత్త లైన్ల ఏర్పాటు, డిమాండ్ కు తగ్గట్టుగా రైళ్ల సంఖ్యను పెంచడం, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ తదితర అంశాలపై దృష్టి సారించి కీలకంగా పనిచేస్తుంది. రాష్ట్రాల నుండి వస్తున్న విజ్ఞప్తులను సానుకూల దృక్పథంతో వింటూ అవసరం మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది.
రైల్వేకు విన్నపాలు
ఇక ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రైల్వేకు విజ్ఞాపనలు వెల్లువగా మారుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి రైల్వే లైన్ల కోసం, కొత్త రైళ్ల ఏర్పాటు కోసం విజ్ఞప్తులు రాగా తాజాగా, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అనేక విజ్ఞాపనలు కేంద్రానికి చేరనున్నాయి.

భూపాలపల్లికి కొత్త రైల్వే లైన్, రైల్వే స్టేషన్
తాజాగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడానికి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న రైల్వే సమస్యలపైన ప్రస్తావించారు. ఈ సందర్భంలో భూపాలపల్లికి కొత్త రైల్వేస్టేషన్, రైల్వే లైన్ను మంజూరుపై ఎంపీ కడియం కావ్య మాట్లాడారు.
రైల్వే లైన్ మంజూరైతే జరిగే లబ్ది ఇదే
భూపాలపల్లి సింగరేణి కాలరీస్, TGGENCO నుండి బొగ్గును రవాణా చేయడానికి ట్రక్కులపై ఆధారపడుతుందన్నారు. రైల్వే లైన్ మంజూరు అయితే రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం, సరుకు రవాణా ఖర్చులను తగ్గిస్తుందని, ప్రయాణీకుల ప్రయాణంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఇది అవకాశం కల్పిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రపోజల్ ను రైల్వే ముందు పెట్టాలని కడియం కావ్య అన్నారు.
కాజీపేట్ రైల్వే డివిజన్ పై డిమాండ్
అదేవిధంగా కాజీపేటను రైల్వే డివిజన్ చేస్తే రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరం వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రయాణం, వాణిజ్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఉద్యోగ కల్పన, వ్యాపార వృద్ధి, వరంగల్ కీలకమైన కనెక్టివిటీ హబ్గా ఉంటుందని స్పష్టం చేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో రైల్వేకు అత్యధిక రెవెన్యూ అందించబడుతుందని కడియం కావ్య పేర్కొన్నారు.
రైల్వే మంత్రికి వినతిపత్రం ఇవ్వనున్న వరంగల్ ఎంపీ
ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర మంత్రులను అధికారులను కలిసిన ఎంపీ డా.కడియం కావ్య మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని, ఉమ్మడి వరంగల్ రైల్వే సమస్యలను రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications