విజయవాడలో నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య: వెలుగులోకి కీలక విషయాలు
నిజిమాబాద్/విజయవాడ: తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన వ్యాపారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పప్పుల సురేష్, భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు అఖిల్, ఆశిష్తో కలిసి గంగస్థాన్-ఫేజ్-2లోని శ్రీచైతన్య అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఖలీల్వాడిలోని ఓ నర్సింగ్ హోంకు అనుబంధంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. పిల్లలిద్దరూ ఉన్నత చదువులు చదివారు. అంతేగాక, పెద్దబ్బాయికి ఈ ఏడాది పెళ్లి కూడా చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో అప్పుల భారంతో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో ఇతర కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సురేష్ కుటుంబం ఆత్మహత్యకు ఫైనాన్స్ వేధింపులే కారణం..
కాగా, సురేష్ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆ కుటుంబం సూసైడ్ నోట్లో వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులు సూసైడ్ నోట్ రాశారు. ఇబ్బందులు పెట్టినవారి వివరాలను అందులో పేర్కొన్నారు. నోట్ తోపాటు తమను వేధించిన వారి వివరాలను సెల్పీ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను పప్పుల సురేష్ తమ బంధువులకు పంపించారు. ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు
సురేష్ కుటుంబం రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చూరిలో నలుగురి మృతదేహాలను ఉంచారు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే మృతుల బంధువులు విజయవాడ ఆస్పత్రికి చేరుకున్నారు. ఫైనాన్స్ సంస్థల వేధింపులే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు కారణమని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సురేష్ కుటుంబాన్ని వేధించిన నలుగురి వివరాలు నమోదు
కాగా, అప్పుల కోసం కుటుంబాన్ని వేధించిన నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్(58), ఆయన భార్య శ్రీలత(54), కుమారులు అఖిల్(26), (24) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, గత సోమవారం రాత్రి నుంచి సురేష్ కుటుంబం ఇంటి నుంచి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఎంతో ఆనందంగా, అందరితో బాగా ఉండే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం ఎంతోగానే వేదనకు గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు.