Mirchi: క్వింటా మిర్చి రూ.40 వేలు.. ఎక్కడంటే..!
ఎండు మిర్చి ధర భారీగా పెరిగింది. క్వింటా రూ. 30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయి ధర సాధించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రైతు పి.అలిపిరి పండించిన 44 బస్తాల దేశీ రకం మిర్చిని సోమవారం ఏనుమాముల మార్కెట్ కు తీసుకొచ్చారు. మిర్చీ నాణ్యత బాగుండడంతో వ్యాపారులు క్వింటాకు రూ.40 వేలు చెల్లించారు . ఇదే రకం మిర్చి గతేడాది మే నెల చివరలో రూ.95 వేలు పలికిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం ఏపీలోని ఆదోని వ్యవసాయ మార్కెట్ లో కూడా మిర్చి రికార్డు ధరలు పలికింది. ఆదివారం మిర్చి గరిష్ఠంగా రూ.26,299 పలికింది. కనిష్ఠంగా రూ.5,500 గా ఉంది. మిర్చి ధర భారీగా ఉండడంతో మిర్చి పౌడర్ కూడా భారీగా ధర పలుకుతోంది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం వెల్లుల్లి రూ.400 నుంచి రూ.600 పలుకుతోంది.

పావు కిలో వెల్లుల్లి రూ. 150 నుంచి రూ.200 పలుకుతోంది. దీంతో చాలా మంది వెల్లుల్లి కొనడమే మానేశారు. ప్రస్తుతం వెల్లుల్లి జీడిపప్పు ధరలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంది. వెల్లుల్లి రూ. 600 గా ఉంది. అంటే.. జీడిపప్పు కంటే కేవలం రూ.200 తక్కువగా ఉంది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్ని తాకుతోన్నాయి.
మరోవైపు గతేడాది అక్టోబర్, నవంబర్ లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం హోల్ సేల్ లో కిలో ఉల్లి రూ. 15 నుంచి రూ.25 పలుకుతోంది. ఇక బియ్యం ధరల కూడా భారీగా పెరిగాయి. కిలో బియ్యం రూ. 50 నుంచి రూ.70 పలుకుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిటి కిలో రూ.29 బియ్యం విక్రయిస్తోంది.












Click it and Unblock the Notifications