తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్లోని మోంటి్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాల్సిందిగా భట్టి విక్రమార్కకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది.
ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదులు సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు.

ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో నిర్వాహకులు తెలిపారు. ఈ ఆహ్వానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందడం.. తనకు ఎంతగానో గర్వకారణమని వ్యాఖ్యానించారు.
సంపద పంచుతున్నాం: భట్టి విక్రమార్క
ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నామని.. మళ్లీ అదే సంపదను ప్రజలకు పంచుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీపీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి సముచిత పదవులు, ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తుందని.. ఇందుకు పీసీసీ అధ్యక్షునిగా మహేశ్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.












Click it and Unblock the Notifications