అమ్మ కోరిక తీర్చటం కోసం తనయుడి సాహసం; పాత చేతక్ స్కూటర్ పై ఐదేళ్ళుగా!!
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కృష్ణ కుమార్ తన తల్లి కోరిక తీర్చటం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కోసం ఏమైనా చేయొచ్చు. పిల్లల ఉన్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసే తల్లి కోసం ఏవైనా చేయొచ్చు. తమ జీవితాన్ని, తమ సర్వస్వాన్ని పిల్లలకే కేటాయించి, వాళ్ల కోసమే ప్రాణం పెట్టే తల్లి కోసం ఏమైనా చేయొచ్చు. ఇక ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకున్న ఓ తనయుడు తల్లి కోసం చేసిన పని ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.

తల్లి కోరిక తీర్చటానికి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసిన తనయుడు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కృష్ణ కుమార్, తన తల్లి కోసం లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కృష్ణ కుమార్ తల్లి రత్నమ్మ కన్న కలలను నెరవేర్చడం కోసం ఆయన ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు కలిసి సంతోషంగా ఉంటూ జీవనం సాగిస్తారు, వారి కలలు తీర్చుకుంటారు అనుకున్నచోట, భర్త మృతితో రత్నమ్మ తన కల నెరవేరదని బాధపడ్డారు.

దేశ, విదేశాల్లో తీర్ధయాత్రలు చేస్తూ తల్లి కోరిక తీరుస్తున్న తనయుడు
అయితే తల్లి కల గురించి తెలుసుకున్న తనయుడు కృష్ణ కుమార్ అమ్మ కోరిక తీర్చాలి అనుకున్నాడు. మన దేశంలోని తీర్థయాత్రలతో పాటు, ఇతర దేశాలలో ఉన్న తీర్థయాత్రలను కూడా చేస్తూ తల్లి కోరిక తీరుస్తున్నాడు. తల్లి కోరిక తీర్చడం కోసం కృష్ణకుమార్ ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. స్కూటర్ పై తల్లిని తీసుకొని 2018లో బయలుదేరిన కృష్ణ కుమార్, ఇప్పటివరకు తన తల్లికి ఎన్నో ప్రాంతాలను, పుణ్య క్షేత్రాలను చూపించాడు.

స్కూటర్ పై తల్లిని తీర్ధయాత్రలకు తీసుకెళ్ళిన తనయుడు
2020లో కరోనా మహమ్మారి కారణంగా తీర్థయాత్రల పర్యటనలకు బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ ఆరు నెలల నుండి తీర్థయాత్రలు సాగిస్తున్నారు. తల్లికి గైడ్ గా మారి అన్ని పుణ్యక్షేత్రాలను చూపిస్తూ తల్లిని సంతోష పెడుతున్నాడు కృష్ణకుమార్. ఇప్పటివరకు 66 వేల కిలోమీటర్ల మేర స్కూటర్ పై ప్రయాణం చేసి ఎన్నో తీర్థయాత్రలను చేశారు. కర్ణాటక తమిళనాడు, ఒడిశా, చత్తీస్ గడ్, ఏపీ, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కలకత్తాలతోపాటు నేపాల్, బూటాన్, మయన్మార్ లలోని పుణ్య క్షేత్రాలను సందర్శించారు.

బాసర అమ్మవారిని దర్శించుకున్న తల్లీ కొడుకులు.. అమ్మ గురించి గొప్పగా
ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని బాసర సరస్వతి అమ్మవారిని కృష్ణ కుమార్ తన తల్లితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి కోరిక తీర్చడానికి తను తీసుకున్న నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అమ్మను మించి దైవం మరేముంటుందని, అమ్మ కోరిక తీర్చడం కంటే గొప్పతనం ఏముంటుందని కృష్ణ కుమార్ అంటున్నారు.












Click it and Unblock the Notifications