విషాదం: రైల్వే ట్రాక్ వద్ద ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు ఢీకొని యువకుడు మృతి
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని కొందరు యువకులు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తూ తమ ప్రాణాలకుమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, నగరంలోని ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ చేస్తూ దుర్మరణం పాలయ్యాడు. రైల్వేట్రాక్పై ఇన్స్టా రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని సర్పరాజ్(16) అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ రైల్వే లైన్ సమీపంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్నగర్ రైల్వే ట్రాక్ వద్దకు ముగ్గురు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇన్ స్టా రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో సర్పరాజ్ అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.

కాగా, మరో ఇద్దరు ఇద్దరు విద్యార్థులు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద లభించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సర్పరాజ్కు సోషల్ మీడియా ఖాతా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్పరాజ్ మృతి అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications