షెల్టర్హోం గదిలో బంధించి వ్యభిచారం చేయాలంటూ మహిళపై దాడి
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్లో జరుగుతున్న ఓ ఆశ్రమంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ మహిళను వ్యభిచారంలోకి దించేందుకు మరికొందరు మహిళలు ప్రయత్నించారు. అందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన విజయవాడకు చెందిన మహిళ (43) కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చింది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ను కలిసి నగరంలో తనకు ఆశ్రయం కల్పించాలని కోరింది. దీంతో ఆయన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నామాలగుండులో నిర్వహిస్తున్న మహిళల షెల్టర్హోం అమన్వేదికలో ఉండాలని సూచించారు.
ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి ఆమె అక్కడే ఆశ్రయం పొందుతోంది. షెల్టర్హోంలో ఉంటున్న మరికొంత మంది మహిళలు తమతోపాటు వ్యభిచారం నిర్వహించాలని ఒత్తిడి తేగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో మార్చి 7వతేదీన కొందరు మహిళలు తనను హోంలోని ఓ గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు.

అక్కడి నుంచి తప్పించుకుని అదేరోజు రాత్రి చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని బుధవారం నగర సీపీ మహేందర్రెడ్డిని ఆశ్రయించింది.
ప్రస్థుతం తాను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని శివానంద ఆశ్రమం సంరక్షణలో ఉన్నానని, తనపై దాడికి పాల్పడిన వారితోపాటు, షెల్టర్హోం నిర్వాహకులపైన కేసులు నమోదు చేయాలని కోరింది.












Click it and Unblock the Notifications