అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి(ఫొటోలు)
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన బుధవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన బచ్చగారి బాలవర్ధన్ రెడ్డికి మహబూబ్నగర్ జిల్లా తిరుమలగిరికి చెందిన కృష్ణవేణితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చంపాపేటలోని బాలాజీనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాలవర్ధన్ రెడ్డి ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర క్రితం కూతురు జన్మించింది. 23 రోజుల కిందట కృష్ణవేణి రెండో కాన్పులో మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బుధవారం కృష్ణవేణి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని కన్పించింది.
ఇదిలా ఉంటే తమ సోదరి కృష్ణవేణిని ఆమె భర్త బాలవర్ధన్ రెడ్డి అతని తల్లి కలిసి హత్య చేశారని కృష్ణారెడ్డి ఆరోపించారు. మళ్లీ ఆడపిల్లను కన్నందుకే చంపేశారని ఫిర్యాదు చేశారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.