విషాదం: ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య, ఉచ్చు జారడంతో ఓ చిన్నారి బతికింది!
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి చెందింది. ఓ చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. చీర ఉచ్చు మెడ నుంచి జారడంతో ఆ చిన్నారి మరణం తప్పించుకుంది.
వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్లోని రాంనగర్కు చెందిన వెంకటేష్, ఉరాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కుటుంబ పోషణ కూడా భారం కావడంతో రాణి తీవ్రమనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నకుమార్తె మెడ నుంచి చీర జారిపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. తల్లి ఉమారాణితోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి(13), లక్కీ(11) ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
పెళ్లైన 15ఏళ్ల తర్వాత కూడా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్తతోపాటు అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిజాంపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్మెడ గ్రామానికి చెందిన మంజుల(35), నిజాంపేట మండల కేంద్రానికి చెందిన నాగరాజుకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
అయితే, పెళ్లైన రెండేళ్ల నుంచే అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త నాగరాజు వేధింపులకు గురిచేస్తున్నాడు. పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. శారీరకంగా, మానసికంగా మంజులను వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంజుల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications