ఉద్యోగాల పేరుతో వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు: హెచ్చార్సీలో మహిళ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ నగరాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి బెంగళూరుకు తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వ్యభిచార గృహాలకు వారిని అమ్మేస్తారు. ఇలాంటి దుర్మార్గుల బారిన పడి బెంగళూరు వరకు వెళ్లిన ఓ మహిళ.. ఎలాగోలా తప్పించుకుని వచ్చి హైదరాబాద్లో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. గోల్కొండ ప్రాంతానికి చెందిన అజురా బేగంను దుబాయ్లో ఉద్యోగం పేరిట ఈ ముఠా బుట్టలో వేసుకుంది. బెంగళూరు తీసుకెళ్లిన ముఠా, అక్కడ వ్యభిచార గృహానికి ఆమెను అమ్మేసింది.
ఎలాగోలా తప్పించుకుని హైదరాబాదు చేరుకున్న ఆమె, మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ)ని ఆశ్రయించింది. తనలాగే వ్యభిచార కూపంలో మరో 20 మంది ఇరుక్కున్నారని, వారిని విడిపించాలని ఆమె హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది.
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని మృతి
సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని స్వప్న మృతి చెందింది. వేగంగా వచ్చిన టిప్పర్ స్వప్నను ఢీకొనడంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పరేడ్ రిహార్సల్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రైలుకింద పడి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సురేష్ మృతి
కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో రైలుకింద పడి ఓ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సురేష్ మృతి చెందారు. సురేష్ తన స్వగ్రామమైన ఏలూరుకు వెళ్లుతుండగా ప్రమాదవ శాత్తు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.