వయస్సు రాలేదని పెళ్లి వద్దన్నందుకు యువతి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో రెండు విషాద ఘటనలో చోటుచేసుకున్నాయి. నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని ఓ యువతి, పెళ్లికి నిరాకరించారని మరో యువకుడు ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాల్లో విషాదం నింపారు.
మొదటి ఘటనకు సంబంధించి మైలార్దేవుపల్లి ఎస్సై లక్ష్మీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వట్టెపల్లి గుంటాల్బాబాదర్గా బస్తీకి చెందిన మొహ్మద్ ముక్తార్ కుమార్తె షమబేగం(17) చిన్నపాటి విషయానికే ఆగ్రహానికి గురవుతుంటుంది. కాగా, ఆమె స్థానికంగా ఉండే లడ్డూ అనే యువకుడిని ప్రేమించింది.
అతడినే పెళ్లిచేసుకుంటానని తల్లిదండ్రులను కోరింది. నిరాకరిస్తే కోపగించుకుంటుందని ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెకింకా పెళ్లి వయసు రాలేదని.. మరో ఏడాదికి గడిచాక వివాహం చేస్తామని తెలిపారు.

తన ప్రేమను కాదంటారా? అంటూ రెండురోజులక్రితం గదిలోకెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే తల్లిదండ్రులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
అమ్మా క్షమించు: పెళ్లి నిరాకరణపై మనస్తాపం, యువకుడు ఆత్మహత్య
మరో ఘటనలో ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయితో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'అమ్మా.. నన్ను కనిపెంచిన మీకన్నా.. నాలుగు సంవత్సరాల క్రితం పరిచయమైన ఆ అమ్మాయి అంటేనే నాకు ఇష్టం. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి చేసుకుంటానంటే మీకు సామాజిక వర్గం అడ్డు వచ్చింది. అందుకే పెళ్లికి ఒప్పకోవడం లేదు.. ఇక ప్రేమించిన యువతితో నాకు పెళ్లి కాదని అర్థమైంది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించు అమ్మా' అని సూసైడ్ నోట్ రాసిన ఆ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి భువనగిరి వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి వంతెన వద్ద ఉన్న రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. పట్టాలపై పడి ఉన్న మృతదేహంను స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని జేబులో లభించిన సూసైడ్ నోటును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నాలుగు సంవత్సరాల నుంచి యువతిని ప్రేమిస్తున్నట్టు, పెళ్లికి తల్లి అడ్డం పడుతున్నట్టు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉంది.
చిరునామా, తల్లిదండ్రుల వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నారు.ఎవరికైనా మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications