ప్రియురాలితో ఫోన్ చేయించి..: పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపేశారు
ప్రేమే అతడి ప్రాణం తీసింది. ప్రియురాలి తండ్రి, సోదరులు కలిసి పట్టపగలే అతడ్ని దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం చర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది.
జగిత్యాల: ప్రేమే అతడి ప్రాణం తీసింది. ప్రియురాలి తండ్రి, సోదరులు కలిసి పట్టపగలే అతడ్ని దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం చర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది.
హెచ్చరించినా..
పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామానికి చెందిన జుంజుపల్లి సుధాకర్(28), అదే గ్రామానికి చెందిన సిగిరి సుమ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్కు తెలిసింది. దీంతో సుమతో మాట్లాడవద్దని సుధాకర్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా సుధాకర్.. సుమను కలుస్తుండటంతో అతనిపై కోపం పెంచుకున్నారు.
తరచూ వివాదాలు
ఈ క్రమంలో ఓ రోజు సుమ, సుధాకర్ బైక్పై జగిత్యాల నుంచి వస్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో సుమకు గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు సుధాకర్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుధాకర్ ఓ రోజు సుమ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. దీంతో సుధాకర్ బెదిరింపులకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై మరో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తరచూ వీరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సుధాకర్ను ఎలాగైనా హతమార్చాలని సుమ తండ్రి, సోదరులు నిర్ణయించుకున్నారు.
మాటువేసి..
పథకం ప్రకారం మంగళవారం ఉదయం సుమతో సుధాకర్కు ఫోన్ చేయించారు. అతడు వస్తాడని తెలిసి జగిత్యాల-ధర్మారం రోడ్డుపై ఓ ఆటోలో సుమ తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్లు మాటువేశారు. సుధాకర్ బైక్పై రోడ్డుపైకి రాగానే అతడ్ని ఆటోతో ఢీకొట్టారు. సుధాకర్ కిందపడగానే వెంట తెచ్చుకున్న గొడ్డలితో అతడ్ని నరికి చంపారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులు ఉన్న సుధాకర్ను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చివరకు వేధించాడన్న సుమ..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు సుమ తండ్రి రామయ్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామయ్య ఇద్దరు కొడుకులు పరరీలో ఉన్నారు. సుమను కేసు విషయంలో ప్రశ్నించగా.. సుధాకర్ రెండేళ్లుగా తన వెంటపడుతున్నాడని, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.