Nagarjuna Sagar Exit Poll : సాగర్లో ఎగిరేది గులాబీ జెండానే... ఆరా,ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాలు
తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆరా,ఆత్మసాక్షి సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోనుందని తేలింది. టీఆర్ఎస్కు 50శాతం పైచిలుకు ఓట్లు వస్తాయని వెల్లడైంది.
ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం... టీఆర్ఎస్కు50.48శాతం,కాంగ్రెస్కు 39.8శాతం,బీజేపీకి 6.31శాతం ఓట్లు రానున్నాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం... టీఆర్ఎస్కు 43.5శాతం,కాంగ్రెస్కు 36.5శాతం,బీజేపీకి 14.6శాతం ఓట్లు దక్కనున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి సాగర్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నట్లు స్పష్టమవుతోంది. ఇక బీజేపీ ఇక్కడ పూర్తిగా తేలిపోవడం ఖాయమేనని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 17న ఉపఎన్నికకు పోలింగ్ జరగ్గా.. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ తరుపున నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్,కాంగ్రెస్ తరుపున జానారెడ్డి,బీజేపీ తరుపున రవి నాయక్ బరిలో ఉన్నారు.
తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాభవంతో సాగర్ ఉపఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. సాగర్లోనూ బీజేపీ మ్యాజిక్ చేయగలదా అన్న చర్చ జరిగింది. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రధానంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ల మధ్యే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున బలమైన నేత జానారెడ్డి బరిలో దిగడంతో టీఆర్ఎస్ ఈ ఉపఎన్నిక కోసం చాలానే శ్రమించింది.
దుబ్బాక ఉపఎన్నిక నేర్పిన పాఠంతో సాగర్ ఉపఎన్నిక విషయంలో ముందుగానే మేల్కొన్నది. ఉపఎన్నికకు రెండు నెలల ముందే టీఆర్ఎస్ కీలక నేతలకు సాగర్లో కీలక బాధ్యతలు అప్పగించి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో అటువైపు తొంగైనా చూడని కేసీఆర్... ఈసారి రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారంటే సాగర్ ఉపఎన్నికను ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది. సాగర్లో గెలుపుతో తెలంగాణలో తమ పట్టు తగ్గలేదని టీఆర్ఎస్ నిరూపించాలనుకుంటోంది. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడం,త్వరితగతిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం తదితర అంశాలు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.