ABP- C Voter survey: రేవంత్ రెడ్డి ఫుల్ ఖుష్
Revanth Reddy: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి.
ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది బహిరంగ రహస్యం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. వంటి ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి. మొదట ఈ గ్యారంటీలను ప్రకటించింది కర్ణాటకలో. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అయింది. పార్టీకి అధికారాన్ని అప్పగించింది.
ఇప్పుడా ఫార్ములా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణను తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు- మరోసారి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం ఖాయమైంది.
లోక్సభ ఎన్నికలపై తాజాగా ఏబీపీ- సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.
భారత్ రాష్ట్ర సమితికి మరోమారు పరాజయం తప్పదని తేల్చి చెప్పింది. 3 నుంచి 5 సీట్లల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.












Click it and Unblock the Notifications