ఓటుకు నోటు కేసు నిందితుడు సెబాస్టియన్ మరో 'ఘనకార్యం'
ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్ గుర్తుండే ఉంటుంది. గత పదేళ్ల నుంచి ఆయన ఇంటి అద్దె చెల్లించకుండా నకిలీ పత్రాలు సృష్టించి ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇల్లు ఖాళీ చ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్ గుర్తుండే ఉంటుంది. గత పదేళ్ల నుంచి ఆయన ఇంటి అద్దె చెల్లించకుండా నకిలీ పత్రాలు సృష్టించి ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని అడిగితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు.
ఈ సంఘటన హైదరాబాదులోని ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఓటుకు నోటుకేసులో నిందితుడు సెబాష్టియన్ మోతీనగర్ డివిజన్ వికాస్పురి కాలనీలో ఫిలిప్స్ అనే వ్యక్తి ఇంట్లో 2003లో అద్దెకు దిగాడు. పదేళ్లుగా అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని, కుటుంబసభ్యులను వేధిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
అద్దె విషయంలో యజమానికి, సెబాస్టియన్కు మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇరువురు కూడా పోలీస్స్టేషన్ దాకా వెళ్లారు. సెబాష్టియన్ 2008లో కోర్టు నుంచి స్టే తెచ్చుకోగా యజమాని ఫిలిప్స్ అప్పీలు చేశారు. గతనెల 10న సెబాష్టియన్ ఇల్లు ఖాళీ చేసి వేరేచోట ఉంటున్నాడు.
అతడి కుమారుడు అభిషేక్, అనుచరులు అర్ధరాత్రి తాగి వచ్చి భయాందోళ నకు గురిచేస్తున్నారని ఫిలిప్స్ ఆరోపించారు. సెబాష్టియన్ తనయుడు, అతని అనుచరుల ఆగడాలు భరించలేక తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఫిలిప్స్ కుటుంబసభ్యులు గురువారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వహీదుద్దీన్ తెలిపారు.