ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక అడుగు.. ఆ నోటిఫికేషన్ జారీ!
ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. తాజాగా ఎయిర్పోర్ట్ స్టేషన్ నిర్మాణం కోసం ఆగస్టు 21వ తేదీన అధికారులు సర్వే నిర్వహించగా దీనికి సంబంధించిన పనులలో వేగం పెరిగిందని తెలుస్తోంది. ఆదిలాబాద్లో ప్రతిష్ఠాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ నిర్మాణం దిశగా కూడా కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2,009 ఎకరాల భూమి సేకరణకు గ్రీన్సిగ్నల్
రోడ్లు, భవనాల శాఖ జీవో ద్వారా 2,009.23 ఎకరాల భూమి సేకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఇందులో 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అవసరాలకు, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ సౌకర్యాలు, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు మరియు భవిష్యత్ విస్తరణకు కేటాయించనున్నారు. దీనికోసం గతంలో 700 ఎకరాల సేకరణ ప్రతిపాదన ఉండగా, ఇప్పుడు పూర్తి స్థాయి జాయింట్ యూజర్ విమానాశ్రయం కోసం విస్తృత భూమి సేకరించాలని నిర్ణయించారు.

9,000 అడుగుల రన్వేతో ప్రణాళిక
ఐఏఎఫ్ వద్ద ఇప్పటికే 369.45 ఎకరాలు ఉన్నాయి. 9,000 అడుగుల రన్వేతో రక్షణ, పౌర విమానయాన అవసరాలు తీర్చేలా దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించారు.
భూసేకరణ ఖర్చు రూ.1,555.11 కోట్లు కాగా, 765 కేవీ హైటెన్షన్ టవర్ల తరలింపు, వాగుల మళ్లింపు, ఆదిలాబాద్-అనుకుంట రోడ్డు రీఅలైన్మెంట్, మిషన్ భగీరథ పైప్లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించారు.
భూసేకరణ అప్పటికి పూర్తి చెయ్యాలని లక్ష్యం
ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను భూసేకరణ, యుటిలిటీల మార్పు పనులను ప్రాధాన్యంగా తీసుకొని 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి గేమ్చేంజర్గా నిలుస్తుందని, పరిశ్రమలు, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా మరో అడుగు పడినట్లయింది.












Click it and Unblock the Notifications