మావోయిస్టు ఆజాద్ కేసులో కీలక మలుపు: కేసు పునర్విచారణ, 26 మంది పోలీసులకు నోటీసులు
ఆదిలాబాద్: మావోయిస్టు కీలక నేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్కుమార్ ఎన్కౌంటర్ కేసులో గురువారం నాడు ఆదిలాబాద్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో 26 మంది తెలంగాణ పోలీసులకు ఆదిలాబాద్ కోర్టు గురువారం నాడు నోటీసులు పంపింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు సూచించింది.
ఆదిలాబద్ కోర్టు కేసు తీర్పుతో మరోసారి ఆజాద్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో 2010 జూలై 1వ, తేదిన ఆజాద్, అతనితో పాటు హేమచంద్ర పాండే అనే జర్నలిస్టు ఎన్కౌంటర్కు గురయ్యారు. ఈ ఎన్కౌంటర్పై ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు అనేక అనుమానాలను వ్యక్తం చేశాయి.

అయితే ఈ కేసుపై సిబిఐ విచారణ కూడ నిర్వహించింది. సిబిఐ విచారణపై కూడ హక్కుల సంఘాలు అనుమానాలను వ్యక్తం చేశాయి. అయితే ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన జర్నలిస్టు హేమచంద్ర పాండే సతీమణి, ఆజాద్ సతీమణి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేశారు.
2010 జూలై 1వ, తేదిన వాంకిడి మండలం వెలిగి సర్కేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత ఆజాద్ ,జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ జరిగింది.ఈ ఎన్కౌంటర్పై సిబిఐ విచారణ జరిగింది.
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై 2012 ఏప్రిల్ 13న, స్వతంత్ర విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ విచారణపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం, రంజనా ప్రకాష్ దేశాయ్తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్వతంత్ర విచారణకు ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.నిజమైన ఎదురు కాల్పుల్లోనే ఆజాద్ , హేమచంద్ర మరణించారని సిబిఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు మార్చి 16వ తేదీన ప్రకటించింది.
అయితే ఈ కేసు విషయమై కింది కోర్టులో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించడంతో బాధితులు మరోసారి ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును పునర్విచారణ చేయాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 26 మంది పోలీసు అధికారులకు ఆదిలాబాద్ కోర్టు నోటీసులు పంపింది.అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలోని కింది కోర్టు ఈ కేసును తొలుత కొట్టేసింది. అదే కోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications