మైనర్ బాలికపై పలుమార్లు రేప్: తండ్రీకొడుకుల అరెస్ట్
హైదరాబాద్: తమ ఇంట్లో పనికి చేరిన దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడైన కొడుకు, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ వేణుగోపాల్రావు వివరాలు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన దళిత బాలిక(16) తొమ్మిది నెలల క్రితం నగరంలోని కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే న్యాయవాది మేడిపల్లి సుధాకర్రెడ్డి(65) ఇంట్లో పనికి కుదిరింది. కాగా, బాలిక మరో ఇంటికి వెళ్లకుండా సుధాకర్రెడ్డి కట్టడి చేశాడు. అంతేగాక, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.

సుధాకర్రెడ్డి కొడుకు, న్యాయశాస్త్రం చదువుతున్న భరత్కుమార్రెడ్డి(29) కూడా మూడు నెలలుగా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు.. సదరు బాలికను బెదిరించి మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బైరామల్గూడకు చెందిన ఓ మహిళా సంఘం నేత, సహచరులతో కలిసి సుధాకర్రెడ్డి ఇంటిపై దాడి చేసి బాలికను కాపాడారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు, నిర్బంధించి పని చేయించడం, జువైనల్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని ఏసీపీ వెల్లడించారు. పరారైన నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేసిన చైతన్యపురి పోలీసులు, గురువారం రిమాండుకు తరలించారని ఏసీపీ వేణుగోపాల్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications