రూ.2కోట్లు సుపారీ.. అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య కేసులో ట్విస్ట్...
అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ జంట హత్యలకు రూ.2 కోట్లు సుపారీ మాట్లాడినట్లు పోలీసులకు ఓ లేఖ అందినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఇచ్చిందెవరు.. తీసుకున్నదెవరు అన్న వివరాలు కూడా అందులో పేర్కొనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. సుపారీ కింద అందిన రూ.2కోట్లు నేరుగా డబ్బు రూపంలోనే ఇచ్చారా లేక మరో రూపంలో అందాయా అన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లాలోని కల్వచర్ల సమీపంలో అడ్వకేట్ దంపతులు వామనరావు,నాగమణి హత్యకు గురైన సంగతి తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు వీరిని కిరాతకంగా హత్య చేశారు. మంథని పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీను ఈ హత్య చేయించినట్లుగా ఆరోపణలున్నాయి. అక్కపాక కుమార్,చిరంజీవిలతో కలిసి కుంట శ్రీను ఈ హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీను కూడా కొద్ది రోజుల క్రితం ఈ కేసులో అరెస్టయ్యాడు.
హంతకులకు బిట్టు శ్రీను కారుతో పాటు కొబ్బరి బోండాలు నరికే రెండు కత్తులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ హత్యల వెనుక పుట్ట మధు హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను పుట్ట మధు ఖండించారు. కింది స్థాయి నుంచి ఎదిగొచ్చిన తనపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గుంజపడగ గ్రామంలో ఓ ఆలయ నిర్మాణానికి సంబంధించి కుంట శ్రీను,అడ్వకేట్ వామన్ రావుల మధ్య గొడవలు జరిగినట్లు ప్రచారం ఉంది. అలాగే స్థానికంగా పలు అభివృద్ది పనులకు సంబంధించిన విషయంలోనూ ఇరువురి మధ్య వివాదాలు నెలకొన్నాయన్న ప్రచారం కూడా ఉంది. జంట హత్యల కేసులో కుంట శ్రీను ఏ1గా,శివందుల చిరంజీవి ఏ2గా,అక్కపాక కుమార్ ఏ3,బిట్టు శ్రీను ఏ4గా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం బిట్టు శ్రీనును మంథని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరచగా... ఆ సమయంలో పుట్ట మధు భార్య పుట్ట శైలజ శ్రీనుతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు శైలజపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో సెక్షన్ 186 కింద శైలజపై కేసు నమోదైంది. ప్రస్తుతం వామన్ రావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.