ఇక నుంచి బ్యాంకుల్లో ఇంకుపడుద్ది
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా నగదు మార్పిడి కోసం వచ్చే ఖాతాదారులకు వేలికి సిరా చుక్క గుర్తు పెడుతున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్ళిన వారికి ఏ రకంగా సిరా గుర్తు వేలికి పెడతారో.....నగదు మార్పిడి కోసం వచ్చే వారికి కూడ సిరా గుర్తు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి నగదు అందేలా ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత అందరికీ నోట్లను మార్పిడి చేసుకొనేందుకు వీలుగా బ్యాంకు అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఒకరే పదే పదే క్యూ లైన్లలో నిలబడి డబ్బులను మార్చుకోకుడా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొన్నారు.
నగదు తీసుకొన్న వారు వెంటనే మరోసారి లైన్లలో నిలబడి నగదును మార్చుకోవడం లాంటి చర్యలకు సిరాచుక్కతో చెక్ పెట్టేయవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నగదును మార్పిడి చేసుకొన్నవారికి వెంటనే వేలికి సిరాచుక్కను పెడుతున్నారు.
చేతికి సిరా చుక్క ఉన్నవారు వెంటనే నగదు మార్పిడి కోసం వెళ్తే అధికారులు డబ్బులు చెల్లించడం లేదు.అందరికీ కొత్త నగదు నోట్లను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయితే దొంగ ఓట్లు వేసేవారు ఉపయోగించినట్టుగా అక్రమపద్దతిలో సిరాను తుడిచివేసుకొని నగదు మార్పిడి కోసం వచ్చేవారిని ఎలా నిలువరిస్తారో చూడాలి.