సీమ ప్రాజెక్టుల పరిశీలన..అవసరమైతే బలగాలు: కేసీఆర్-షెకావత్ ఫోన్ చర్చలు : బోర్డుకు ఆదేశాలు..!!
ఏపీ-తెలంగాణ మధ్య నీటి వివాదాల పైన మాటల తూటాలు పేలుతున్న సమయంలో కేంద్ర జల శక్తి మంత్రి జోక్యం చేసుకున్నారు. ఏపీలో ప్రాజెక్టుల అభ్యంతరాల పైన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ లో చర్చలు చేసారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను పక్కన పెట్టి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీని పైనే సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మద్య చర్చలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం మాట్లాడారు.
ఇరురాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని, రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారంలో నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి కేంద్రమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు కేఆర్ఎంబీ అధికారుల వెనకడుగు వేశారనే విషయం పైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అవసరమైతే.. కేంద్ర బలగాల సహాయంతో ప్రాజెక్ట్ను పరిశీలిస్తారంటూ గజేంద్ర షెకావత్ సూచించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ అధికారులు రెండ్రోజుల్లో ప్రాజెక్ట్ను పరిశీలించనున్నారు. ఇప్పటికే కేఆర్ఎంబీ రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో పాటుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ ఇదే అంశం పైన ఈ రోజు విచారణ జరిగింది. ఆదేశాలను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఇక, ఇదే సమయం లో కేంద్ర మంత్రి సైతం జోక్యం చేసుకోవటంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. అయితే, ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం తాము తమ కేటాయింపులకు అనుగుణంగానే వాడుకుంటున్నామని.. చుక్క నీరు కూడా అదనంగా వాడుకోవటం లేదని స్పష్టం చేస్తున్నారు. కానీ, రాజకీయంగా ఇప్పుడు ఈ అంశం పైన తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇక, ఇన్ని రకాలుగా ఒత్తిడి వస్తున్న ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.