జూబ్లీహిల్స్ జోష్..! స్ధానిక ఎన్నికలపై రేవంత్ కీలక ప్రకటన..!
తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్ధానం ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్ధి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ రాష్ట్రంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటున్న వేళ రేవంత్ ఈ ప్రకటన చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్ విజయంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు హైదరాబాద్ లో సరైన ఫలితాలు రాలేదని, కానీ ఇప్పుడు ప్రజలు తమ రెండేళ్ల పాలనను నిశితంగా గమనించి ఈ తీర్పు ఇచ్చారని రేవంత్ తెలిపారు.

రాష్ట్రాభివృద్దికి కేంద్రమంత్రులు కలిసి రావాలని సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రాజెక్టులు రాకుండా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. మెట్రో, మూసీ ప్రక్షాళన అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే బీజేపీకి ఓట్లు తగ్గాయని రేవంత్ గుర్తుచేశారు. అలాగే అసూయ తగ్గించుకోవాలని విపక్ష నేత కేటీఆర్ కు రేవంత్ సూచించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలన్నారు.

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి, బీజేపీకి డిపాజిట్ రాదని తాను ముందే చెప్పానని రేవంత్ గుర్తుచేశారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వకపోయినా జూబ్లీహిల్స్ లో సహకరించిన ఓవైసీకి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు పాలిస్తుందని రేవంత్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications