బీజేపీని గద్దె దించుతాం: కేసీఆర్పై అఖిలేష్ యాదవ్ ప్రశంసలు
ఖమ్మం: తెలంగాణలో బీజేపీని తరిమికొట్టండి.. యూపీ నుంచి కూడా ఆ పార్టీని వెళ్లగొడతామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి అవతరించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

బీజేపీ గద్దె దిగడం ఖాయమన్న అఖిలేష్ యాదవ్
ఈ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తునూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గద్దె దిగడం ఖాయమని అన్నారు. కేంద్రం రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. జీ20 అధ్యక్ష వహించడం భారత్ కు మంచి అవకాశమని, దీన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

ఇంత పెద్ద సభ ఎప్పుడూ చూడలేదంటూ కేసీఆర్పై అఖిలేష్
ఇక ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై అఖిలేష్ ప్రశంలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంతగొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్ కు అఖిలేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంత పెద్ద సభ ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, కేసీఆర్ అద్భుతంగా ఆలయ నిర్మాణం చేపట్టారని అఖిలేష్ యాదవ్ కొనియాడారు.

ప్రధాని అయ్యే వ్యక్తులు యూపీ వస్తారన్న అఖిలేష్
తెలంగాణ సీఎం కేసీఆర్ కొండంత పనిచేసి గోరంత చెప్పుకుంటున్నారని.. అదే కొందరు గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారని కేంద్రంపై అఖిలేష్ యాదవ్ పరోక్ష విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులు మిగిలి ఉన్నాయన్నారు. బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు.
యూపీలోనూ బీజేపీ గద్దె దించుతామన్నారు. ప్రధాని అయ్యే వ్యక్తులు.. యూపీ తప్పకుండా వస్తారన్నారు. ప్రధాని కావడం కోసమే గుజరాత్ నుంచి.. ఉత్తరప్రదేశ్ వచ్చారని విమర్శించారు. బీజేపీ కేవలం భ్రమలు కల్పిస్తుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని అఖిలేష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications