రవి ప్రకాశ్ కోట్లాది నిధులు దారి మళ్లించారు: బోర్డు అనుమతి లేకుండానే: క్రిమినల్ చర్యలు తప్పవా..!
టీవీ9 మాజీ సీఈవో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అరెస్ట్ తప్పదని చెబుతున్నారు. టీవీ9 సీఈవో గా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు అనేకం ఆయన మీద నమోదయ్యాయి. వాటి మీద విచారణ ఎదుర్కొన్నారు. రవి ప్రకాశ్ దురుద్దేశపూర్వకంగానే నిధులు మళ్లించారని ప్రస్తుత టీవీ9 యాజమాన్యం ఆరోపించింది. 41 సీఆర్పీసీ ప్రకారం రవిప్రకాష్కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయగా... వాటిని తీసుకునేందుకు రవిప్రకాష్ నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. బోర్డు అనుమతి లేకుండా రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని కొత్త యాజమాన్యం ఆరోపిస్తోంది.

రవి ప్రకాశ్ నిధులు మళ్లించారంటూ..
కొంత కాలంగా టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ మీద కొత్త యాజమన్యం అనేక ఫిర్యాదులు చేసింది. సంస్థ డాక్యుమెంట్ల ఫోర్జరీ..తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్క్రైమ్ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలందా మీడియా ఫిర్యాదుల మేరకు రవి ప్రకాశ్ మీద పోలీసులు కేసులు నమోదు చేసారు. అవి కొనసాగుతుండగానే..ఇప్పుడు రవి ప్రకాశ్ మీద కొత్త ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆయన డైరెక్టర్ల అనుమతి లేకుండా కోట్లాది రూపాయాలు సొంత అవసరాలకు వాడుకున్నారనే ఫిర్యాదు మేరకు ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ. 18.31 కోట్లు సొంత ఖాతాలకు మళ్లింపు..
పదిమంది పోలీసుల బృందం రవిప్రకాష్ ఇంటికి వెళ్లి... కారణం చెప్పకుండా అరెస్టు చేసి తీసుకెళ్లింది. రవిప్రకాష్, మూర్తి, ఫెరీరియోలపై టీవీ9 కొత్త యాజమాన్యం బంజారాహిల్స్ పీఎస్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. బోర్డు అనుమతి లేకుండా రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని ఆరోపించింది. రికార్డుల పరిశీలనలో వెల్లడైన విషయాలపై పీఎస్లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవిప్రకాష్ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని టీవీ9 యాజమాన్యం ఆరోపించింది. 41 సీఆర్పీసీ ప్రకారం రవిప్రకాష్కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయగా... వాటిని తీసుకునేందుకు రవిప్రకాష్ నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు.

రవితో పాటుగా మూర్తి పైనా..
సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్తో పాటు ఏబీసీఎల్ మాజీ సీఎఫ్వో ఎంకేవీఎన్ మూర్తిపై బంజరాహిల్స్ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రవిప్రకాశ్ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారు. అలాగే డైరెక్టర్గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది.

బోనస్ లు ప్రకటించుకొని నిధులు ఇలా..
సంస్థ యాజమాన్యంతో సంబంధం లేకుండా వీరు ముగ్గురు కలిసి తమకు తాము భారీగా బోనస్లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసారు. దీని మేరకు ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే..రవి ప్రకాశ్ మీద క్రిమినల్ చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ఆయన అరెస్ట్ పైన పోలీసులు అధికారికంగా సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications